తిరుపతి,అర్జున్ సమాచారం:
తిరుపతి జిల్లాలో షెడ్యూల్డ్ కులాల ( ఎస్సీ ) సంక్షేమం, హక్కుల పరిరక్షణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా ఆదేశించారు. శుక్రవారం శ్రీ పద్మావతి అతిథి గృహంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు మరియు కమిషన్ అధికారులతో కలిసి ఆయన సాంఘిక సంక్షేమ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి ఎస్సీ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా చేరాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులను సకాలంలో భర్తీ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించి, విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు మెరుగైన విద్యా వాతావరణం అందించాలని సూచించారు. యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి అవకాశాలు పెంచాలని, అట్రాసిటీ కేసుల విచారణను వేగవంతం చేసి బాధితులకు చట్టపరమైన పరిహారం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్సీ వర్గాల సంక్షేమానికి అమలవుతున్న పథకాలు, వసతి గృహాల నిర్వహణ మరియు అట్రాసిటీ కేసుల పరిష్కారానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన సమీక్షా నివేదికను చైర్మన్కు అందించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్ఓ, దేవాదాయ, రెవెన్యూ, పోలీసు, విద్య మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
==============================